విజయవాడ: మార్చి 27 నుంచి కడప-విజయవాడ మధ్య ఇండిగో విమానాలు నడవనున్నాయి. అదేవిధంగా కడప నుంచి చెన్నైకి కూడా విమానాలు నడిపేందుకు ఇండిగో సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్) తో చేసుకున్న ఒప్పందం మేరకు కడప నుంచి విజయవాడ, చెన్నైలకు ఇండిగో తన విమాన సర్వీసులను నడపనున్నది.
ఇప్పటివరకు ఈ రూట్లలో విమాన సర్వీసులు నడిపిన ట్రూజెట్.. సర్వీసుల నిర్వహణ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది. దాంతో ఈ రూట్లో విమానాలను నడిపేందుకు ఇండిగోకు అవకాశం వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్ల మొత్తాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద కంపెనీకి ప్రభుత్వం చెల్లించనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 27 వ తేదీ నుంచి చెన్నై-కడప, విజయవాడ-కడప మధ్య వారానికి నాలుగు విమానాలను ఇండిగో సంస్థ నడపనున్నది.