అమరావతి : సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. వైఎస్ జగన్ పాదయాత్రలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవాప్తంగా మున్సిపల్, పంచాయతీ కార్మికులు సమ్మెను నిర్వహిస్తున్నారు. అనకాపల్లిలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేట్ కార్మికులతో పనులు చేయిస్తున్న మున్సిపల్ కమిషనర్ను వారు అడ్డుకున్నారు.
జీతాలు పెంచకపోగా ఉన్న జీతాలను తగ్గించడం ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. 11వ పీఆర్సీ ప్రకారం 21వేల వేతనం చెల్లించాలని అదేవిధంగా భత్యం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం కార్మికుల పొట్టను కొడుతుందని ఆరోపించారు. కర్నూలులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలని , పర్మినెంట్ కార్మికులకు సరెండర్ లీవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రేపు కార్మిక సంఘాలతో చర్చలకు ఆహ్వానం
కాగా మంత్రి సురేశ్ కార్మికుల సమ్మెపై స్పందించారు. రేపు కార్మిక సంఘాల నాయకులతో చర్చలకు ఆహ్వానించారు. కార్మికుల 22 డిమాండ్లలో 21 పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.