అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవిశాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఏపీలో దాదాపుగా 75 పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన వివరించారు. శేషాచలం అటవిప్రాంతాన్ని కారిడార్గా చేసుకుని పులు సంచరిస్తున్నాయని, ఇవి పాపికొండల వైపు కూడా సంచరిస్తున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 2018లో ఉన్న పులుల సంఖ్య కంటే 60 శాతం పులులు పెరిగాయని వివరించారు. భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జనసాగర్ , శ్రీశైలం మధ్య ఉందని అన్నారు. పులుల సంఖ్య మరింత వృద్ధి చెందేలా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని అటవిశాఖ అధికారులకు సూచించారు.