అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి రెండు నెలలు కాకముందే డీజిల్ సెస్ పేరుతో మరోసారి పెంచడం సామాన్యుడిపై పెను భారం మోపడమేనని ఆరోపించారు. పల్లె వెలుగు సర్వీసుల్లో గరిష్టంగా రూ.25, ఎక్స్ప్రెస్లో రూ.90, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంచారని అన్నారు. అధికారంలోకి రాకముందు ప్రజలకిచ్చిన హామీలు బుట్టదాఖలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్పై మండిపడ్డారు.
బాదుడే బాదుడులో భాగంగా డీజిల్ సెస్ పేరుతో రూ.500 కోట్లను పేదల నుంచి వసూలు చేయడానికి ధరలను పెంచిందని విమర్శించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాగా పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఇవాళ నుంచి ఏపీ వ్యాప్తంగా అమలు అవుతున్నాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. కనీస దూరానికి డీజిల్ సెస్ పెంచలేదు.
పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 30 కి.మీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 20 కి.మీ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 55 కి.మీ, ఏసీ సర్వీసుల్లో 35 కి.మీ, అమరావతి సర్వీసుల్లో 55 కి.మీ వరకు ప్రస్తుతం డీజిల్ సెస్సు పెంచలేదు. అంతకుమించి ప్రయాణించే కి.మీ. ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వం డీజిల్ సెస్సును పెంచడం పట్ల అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది.