తిరుమల : తిరుమలలో లడ్డూ తయారీ కోసం రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రపంచంలోనే టాప్ 1 స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబరు నాటికి సిద్ధం చేస్తామని తెలిపారు. ఇటీవల రథసప్తమి ఉత్సవంలో లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు అందించామని వెల్లడించారు . ఓ భక్తుడు ఇచ్చిన రూ.23 కోట్ల విరాళంతో తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుందని వెల్లడించారు.
‘ తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నా’మని , త్వరలో మరో తేదీ నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీదేవస్థానమ్స్ పేరుతో మొబైల్ యాప్ను ప్రారంభించామని పేర్కొన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రసారమవుతున్న గరుడపురాణం భక్తుల మన్ననలు పొందుతుందని వివరించారు .
జనవరి నెలలో 20.78 లక్షల మంది దర్శనం..
తిరుమల శ్రీవారిని జనవరి నెలలో 20.78 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని , హుండీ ఆదాయం రూ.123.07 కోట్లు వచ్చిందన్నారు. ఈనెలలో 1.07 కోట్ల లడ్డూలను విక్రయించామని ఈవో తెలిపారు. 37.38 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని, 7.51 లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు.