తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ (TTD) ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద (Annaprasadam) వితరణ కు రూ.38 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఉదయం అల్పాహారం కోసం రూ.8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని సూచించింది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తామని చెప్పారు.
ప్రస్తుతం అన్నప్రసాదాలు వితరణ చేస్తున్న ప్రాంతాలు
ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (Tarigonda Vengamamba) అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్మెంట్లు, బయటి క్యూలైన్లు, పీఏసీ-4 (పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు.
తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2లోని కంపార్ట్మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.