అమరావతి : శ్రీశైలంలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులకు ఏపీ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. శ్రీశైలం వెళ్లే యాత్రికులు బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే స్పర్శదర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులో ఉన్న విధంగానే శ్రీశైలం విషయంలోనూ అమలు చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఏపీలో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారి కోసం వివిధ ప్యాకేజీలు తీసుకొస్తామన్నారు.
శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
శ్రీశైలం ఆలయంలో గురువారం నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5.30 గంటల నుంచి అంకురారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 7 గంటలకు ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ప్రతిరోజు విశేష పూజలు అందుకోనున్నారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత, పరోక్ష సేవలను ఆలయ అధికారులు నిలిపివేశారు.