అమరావతి : ఏపీలో అధికార కూటమి గేట్లు తెరిస్తే వైసీపీ(YCP) ఖాళీ అవ్వడం ఖాయమని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) పేర్కొన్నారు. నిన్న విశాఖ (Visaka) మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సభ్యులు విజయం త్వరలో జరగబోయే అన్ని ఎన్నికలకు నాంది అని వెల్లడించారు.
గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వైఎస్ జగన్ (YS Jagan) పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదని స్పష్టం చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారని, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో కొంత మందిని లాగేస్తే ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ అనలేదా? అని ప్రశ్నించారు.
వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా.. తాము గౌరవిస్తున్నామన్నారు. నైతిక విలువ కోసం మాట్లాడే అర్హత జగన్కి లేదన్నారు. ఏపీలో దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో జగన్ ధర్నా చేసి అభాసుపాలు అయ్యారన్నారు. త్వరలోనే విశాఖకు మెట్రో రాబోతోందని వివరించారు. విశాఖను పరిపాలన రాజధాని పేరుతో వైసీపీ నేతలు నాశనం చేశారని విమర్శించారు. విశాఖ భూ కుంభకోణాలు బయట పెడతామని తెలిపారు. ఋషికొండ భవనాలను ఏమీ చేయాలో తమకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.