అమరావతి : ఉద్యోగ సమస్యలపై ఈరోజు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. నెలరోజులుగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ, ఫిట్మెంట్తో పాటు 71 సమస్యల పరిష్కారంపై కొనసాగుతున్న ఉత్కంఠపై ఉద్యోగవర్గాల్లో ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం మూడు గంటలకు తన చాంబర్లో నిర్వహించనున్న సమావేశంలో అధికారులు పాల్గొననున్నారు.
ఇదివరకు మంత్రుల స్థాయిలో జరిగిన చర్చల్లో ఉద్యోగుల అభిప్రాయాలను సీఎంకు వివరించనున్నారు. మంత్రులతో జరిగిన చర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు భవిష్యత్ ఆందోళన కార్యాచరణకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎంతో చర్చలపై ఆశలు పెంచుకున్నారు. రేపు ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులతో సీఎం ఇచ్చే వరాలపై తదుపరి కార్యక్రమాలు ఆదారపడి ఉంటాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సీఎం జగన్ ఉద్యోగులకు తీపి కబురు చెబుతారా..లేదా అనే అంశం ఉద్యోగ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది .