Pawan Kalyan | కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తన కోసం ఉదయ్ ఎంతో త్యాగం చేశారని తెలిపారు. అందుకే ఉదయ్కు ఎంపీ సీటు కేటాయిస్తున్నానని తెలిపారు. తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే మోదీ, అమిత్ షా సూచిస్తే మాత్రం కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అప్పుడు ఉదయ్, తాను స్థానాలు మార్చుకుంటామని తెలిపారు. ఈ రెండు స్థానాలు తమకు కీలకమని పేర్కొన్నారు. 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు సీట్లు జనసేన గెలిస్తే.. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా చేస్తా అని తెలిపారు. కాకినాడ ఎంపీ సీటు జనసేనదే అని స్పష్టం చేశారు. గెలవడం కాదు.. కాకినాడలో లక్ష మెజారిటీ రావాలని అన్నారు. కాకినాడ ఎంపీ నియోజకవర్గం దద్దరిల్లాలని అన్నారు. జనసేన లేకపోతే పొత్తులు లేవని అన్నారు. నాపై కోపంతో ఓటుకు రూ.లక్ష ఇచ్చి కొనాలని అనుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఓటుకు రూ. లక్ష ఇచ్చినా జనసేననే గెలుస్తుందన్నారు. వంగా గీత జనసేనలోకి రావాలని కోరుకుంటున్నా అని తెలిపారు.