YS Jagan | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. తనను చంద్రబాబు బచ్చా అంటున్నాడని.. తాను బచ్చా అయితే.. తన చేతిలో ఓడిన నిన్ను ఏమనాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేస్తున్న బస్సు యాత్ర 19వ రోజు అనకాపల్లి జిల్లా చింతపాలెం చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబుపై సెటైర్లు వేశారు.
జగన్ ఒక బచ్చా అని చంద్రబాబు అంటున్నాడని అన్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కాళింది గుర్తొస్తున్నారని అన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్లలో గుర్తొస్తున్నారని చెప్పారు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు విలన్లు అందరికీ కూడా అటువైపు హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ‘ అయ్యా చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకొస్తున్నా. మరి 14 ఏండ్లు సీఎంగా పనిచేసిన నువ్వు.. పేదలకు మంచి చేసి ఉంటే.. బచ్చాను చూసి భయపడి పొత్తుల కోసం ఎగబడుతున్నావు’ అని ప్రశ్నించారు. ఈ 75 ఏండ్ల వయసులో పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబును నిలదీశారు.
ఇంటింటికీ మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకుని ఉన్నారనేది ప్రజలందరూ గమనించాలని ప్రజలను జగన్ కోరారు. జరగబోయే కురుక్షేత్రంలో మీ బిడ్డ ఒకవైపు ఉంటే.. మరోవైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయన్నారు. వీళ్లందరూ సరిపోరన్నట్లుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. వీళ్లందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని చుట్టూ నిలబడి ఉన్నారని తెలిపారు. వీళ్లందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఉన్నాడని అన్నారు. మీ జగన్కు ఆ దేవుడు, ఈ కోట్లాది మంది పేదలు, ఇంటింటిలో ఉన్న అక్కాచెల్లెళ్లు తోడుగా ఉన్నారని గర్వంగా చెప్పారు.
తనను ఎదుర్కోవడానికి నక్కలు అన్నీ ఏకమవుతున్నాయని జగన్ విమర్శించారు. తను సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు వాళ్లు భయపడుతూనే ఉన్నారని అన్నారు. ‘ నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి.. కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నువ్వు ఎవరివి’ అని చంద్రబాబును ప్రశ్నించారు. నేను బచ్చా అయితే ఐదేండ్ల తర్వాత కూడా నువ్వు ఒక్కడివి రావడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదని ప్రశ్నించారు. ఐదేండ్ల తర్వాత కూడా అరడజను మందిని వెనకేసుకుని వస్తున్న నిన్ను ఏమనాలని నిలదీశారు. నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకు, పేదలకు, అక్కాచెల్లెళ్లకు, పిల్లలకు, అవ్వాతాతలకు, సామాజికవర్గాలకు నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధిని.. నువ్వు 14 ఏండ్లు సీఎంగా ఉన్నా ఎందుకు చేయలేకపోయావని ప్రశ్నించారు. ఈ బచ్చా చేసిన పనిని నువ్వెందుకు చేయలేకపోతున్నావ్? అని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో మీ జగన్ ఏం చెబుతున్నాడు? చంద్రబాబు ఏం చెబుతున్నాడో గమనించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.