అమరావతి : తెలంగాణ బిడ్డగా ప్రచారం చేసుకున్న వైఎస్ షర్మిల( YS Sharmila) కు ఆంధ్రలో పీసీసీ అధ్యక్ష పదవి అప్పగిస్తారన్న ప్రచారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ హర్షకుమార్ (Harsa Kumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం మరో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ఆమెకు పీసీసీ ఇస్తే ఆంధ్రలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ను బ్రతికించే నాయకులే లేరా అని అనుమానం వ్యక్తం చేశారు.
షర్మిలకు పీసీసీ (PCC) పదవి ఇవ్వటం కాంగ్రెస్ నాయకులు (Congress leaders) ఎవరూ ఆమోదించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ (Telangana) లో లీడర్షిప్ కావాలనుకున్న షర్మిలను తీసుకువచ్చి పెడితే ఆంధ్ర వాళ్లకు ఆత్మాభిమానం దెబ్బతింటుందని అన్నారు. అన్న వైఎస్ జగన్(YS Jagan), చెల్లెలు షర్మిల ఇద్దరూ ఒకటేనని, వారిని నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరని వెల్లడించారు. ఢిల్లీలో తాను మోదీ (Modi) ని చూసుకుంటానని, నువ్వు సోనియా (Sonia) ను చూసుకో అని శిక్షణ ఇచ్చి షర్మిలను ఢిల్లీకి పంపించి కాంగ్రెస్లో చేర్పించారని ఆరోపించారు. రేపటి రోజున కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇద్దరం సేఫ్గా ఉంటామనే భరోసా ఇచ్చారని విమర్శించారు.