విశాఖపట్నం: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ‘ధీర్య-వివేకం – మేధస్సు’ పేరుతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఐసీఏఐ ఛైర్మన్ గ్రంధి వాసుదేవ మూర్తి అధ్యక్షతన దక్షిణ భారత ప్రాంతీయ మండలి (ఎస్ఐఆర్సీ) విశాఖపట్నం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ఐసీఏఐ అధ్యక్షుడు దేబాషిస్ మిత్ర ముఖ్య అతిథిగా, ఎస్ఐఆర్సీ ఛైర్మన్ చైనా మస్తాన్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకువచ్చని ప్రత్యేక సావనీర్ను దేబాషిస్ మిత్రా విడుదల చేశారు.
మేధో సంపత్తి హక్కులలో సీఏలకు వృత్తిపరమైన అవకాశాలు, అసెస్మెంట్ సంవత్సరానికి వర్తించే స్వచ్ఛంద సంస్థల పన్నుల విమర్శనాత్మక విశ్లేషణ, 2022-23 అసెస్మెంట్ సంవత్సరానికి వర్తించే పన్ను ఆడిట్కు సంబంధించిన పన్నుల తాజా పరిణామాలపై చర్చించారు. సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్లు పురుషోత్తం లాల్ ఖండేల్వాల్, గిరీష్ కుమార్ అహుజా, చంద్రశేఖర్ చిటాలే, వినయ్ గాంధీ బిల్లపాటి, ఆనంద్ ప్రకాష్ జాంగీద్, చైనా సామి గణేశన్ సహా పలువురు వక్తలు చార్టర్డ్ అకౌంటెన్సీ రంగంలో ఆర్థిక, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై ఉపన్యసించారు.
జీఎస్టీ కింద సమకాలీన సమస్యలు, వర్చువల్ డిజిటల్ ఆస్తులకు చట్టబద్ధత, పన్ను విధించడం, సీఏ వృత్తిపై బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రభావాలు, కార్పొరేటేతర సంస్థలకు సంబంధించి అకౌంటింగ్ ప్రమాణాలపై సదస్సు చర్చించనున్నదని ఐసీఏఐ ఛైర్మన్ గ్రంధి వాసుదేవ మూర్తి తెలిపారు. వైస్ చైర్మన్ ప్రశాంత్ పాండా, సెక్రటరీ అనిర్బన్ పాల్, కోశాధికారి అంధవరపు శ్రీధర్, ఎస్ఐసీఏఎస్ఏ చైర్మన్ లోకేష్ పట్నాల, కార్యదర్శి నరేష్ చంద్ర గెల్లి తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.