Pithapuram | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం హాట్ టాపిక్గా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో టీడీపీలో అసమ్మతి చెలరేగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకే పిఠాపురం టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు ఆందోళనలు చేశారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు కలుగజేసుకుని అసమ్మతిని చల్లార్చారు. కానీ ఇంతలోనే పవన్ కళ్యాణ్ నిర్ణయం మార్చారు. మోదీ, అమిత్ షా సూచిస్తే పిఠాపురం వదిలేసి కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని నిన్న జరిగిన మీటింగ్లో పవన్ ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ను పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తానని తెలిపారు. ఇలా ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ తన మాట మార్చడంతో వర్మ సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు పోటీకి దిగినా టీడీపీ నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
సుమారు 20 ఏండ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నా అని వర్మ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశానని చెప్పారు. ఎంతో బాదతో ఈ స్థానాన్ని వదులుకున్నానని.. పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పిఠాపురంలో పవన్ తప్ప వేరే ఎవరొచ్చినా వాళ్ల పల్లకీ మోయనని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరు పోటీలోకి వచ్చినా.. తానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పవన్ ఎంపీగా వెళ్తే తనను పిఠాపురం నుంచి పోటీ చేయమని చంద్రబాబు సూచించారని కూడా చెప్పుకొచ్చారు.