(Murderer Arrest) విశాఖపట్నం: ఈ నెల ఒకటో తేదీన మహిళ అనుమానాస్పద మృతి కేసును నక్కపల్లి పోలీసులు ఛేదించారు. భార్యను హత్య చేసి చనిపోయినట్లుగా నమ్మించేందుకు భర్త ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ హత్య వివరాలను నక్కపల్లి పోలీసులు మీడియాకు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన లక్ష్మణరావు, కోటవురట్ల మండలం రామచంద్రపాలెంకు చెందిన గుబ్బల నాగమణి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఓ తోటలో వాచ్మెన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మణరావు మద్యానికి బానిసై భార్య నాగమణిని వేధించడం ప్రారంభించాడు. గత నెల 31న కూలి పనికి వెళ్లి సంపాదించిన రూ.వెయ్యి ఇవ్వాల్సిందిగా నాగమణిపై ఒత్తిడి తెచ్చాడు. నాగమణి ససేమిరా అనడంతో ఆమెపై దాడి చేశాడు. దాంతో ఆమె చనిపోయింది. నాగమణి చనిపోయిందని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అయితే, పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి లక్ష్మణరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో లక్ష్మణరావును అదుపులోకి తీసుకుని విచారించగా నాగమణిని నేరాన్ని అంగీకరించాడు. దాంతో లక్ష్మణరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.