ప్రకాశం: ఆస్తి తగాదాలతో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. మృతురాలు పెద్ద కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి.. భర్తే హంతకుడి తేల్చారు. తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో జరిగింది.
గురిజేపల్లికి చెందిన పాలెపు శ్రీహరిరావు, సుబ్బాయమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీహరి తన అక్క కూతురిని కూడా పెండ్లి చేసుకున్నాడు. కాగా, శ్రీహరి మొదటి భార్య సుబ్బాయమ్మ తన వ్యవసాయ భూమిని తన పెద్ద కుమార్తె, కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. విషయం తెలుసుకున్న శ్రీహరిరావు, చిన్న కూతురు సుజాత, అల్లుడు బ్రహ్మయ్య ఆమెతో గొడవకు దిగారు. ఈ ఘటనపై సంతమాగులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబంలో అశాంతికి కారణమైన మొదటి భార్యను హత్య చేయాలని శ్రీహరిరావు నిర్ణయించుకున్నాడు.
ముందస్తు పథకం ప్రకారం ఈ నెల 14న భార్య సుబ్బాయమ్మ నిద్రిస్తుండగా ఇంట్లోకి వచ్చిన శ్రీహరిరావు ఆమె గొంతుకోసి హత్య చేశాడు. పెద్ద కుమార్తె రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కూడా శ్రీహరిరావుపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీహరిరావును మంగళవారం అదుపులోకి తీసుకుని విచారించారు. భార్య సుబ్బాయమ్మను హత్య చేసింది తానే అని శ్రీహరిరావు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దాంతో అతడిని రిమాండ్కు తరలించారు.