Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆది దంపతులను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల క్షేమం కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి తెలిపారు. దేవస్థాన ముఖ ద్వారం నుంచి దైవ దర్శనం చేసుకునే వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలియజేశారు. సోమవారం ఆయన శ్రీశైలం పరిధిలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీశైల శిఖరం, ముఖ ద్వారం, సాక్షి గణపతి, నందసర్కిల్ తదితర ప్రాంతాల్లో ఎస్పీ రఘ్వీర్ రెడ్డి పర్యటించారు. ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలపకుండా, ట్రాఫిక్ సజావుగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అటుపై టోల్ గేట్, నంది సర్కిల్, మల్లికార్జున సత్రం, నంది మండపం, పాతాళగంగ తదితర ప్రాంతాల్లో పర్యటించి భద్రత ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా రోడ్ల పై ఉన్న వాహనాలను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాహనాలకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చూసుకునేందుకు నియమించిన బ్లూ కోట్స్ సిబ్బంది 24 X 7 ఉగాది బందోబస్తు ముగిసేవరకు శ్రీశైలంలోనే ఉండాలని స్పష్టం చేశారు. వారికి కేటాయించిన స్థానాల్లో పర్యటిస్తూ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
ఉగాది పండుగ కోసం శ్రీశైలంలో బందోబస్తు నిమిత్తం దాదాపు 1000 మంది పోలీసులను నియమించారు. వారిలో 700 మంది సివిల్ పోలీసులు, 60 మంది స్పెషల్ పార్టీ, కర్ణాటక పోలీసులు 30 మంది, ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు రెండు ప్లాటూన్లు, బీడీ టీమ్ 47 మంది, 130 మంది ఏపీఎస్పీ పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు శ్రీశైలం ఎస్ఐ లక్మణరావు తదితరులు పాల్గొన్నారు.