అమరావతి : కరోనా చికిత్సకు ఆయుర్వేద ఔషధం కోసం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి జనం పోటెత్తుతున్నారు. జనాలు భారీగా తరలిరావడంతో అదుపు చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి.
మీడియా వాహనాలు సైతం ట్రాఫిక్లో చిక్కుకున్నాయి. ప్రస్తుతం అక్కడ 5 వేల మందికి మందు తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సుమారు 35 వేల మంది కృష్ణపట్నానికి చేరుకున్నట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది కొవిడ్ పాజిటివ్ రోగులు ఉన్నట్లు అధికారులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఊళ్లోకి వెళ్లేందుకు ఒకే దారి ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు.
బొనిగి ఆనందయ్య అనే స్థానిక ఆయుర్వేద వైద్యుడు ఈ మందు పంపిణీ చేస్తున్నారు. ఆయుర్వేద గుణాలు కలిగిన ఆకులు, శొంఠి, మిరియాలు, తేనె, అల్లం, ధనియాలు వంటి వాటిని కలిపి లేహ్యం తయారు చేసి గతంలో స్థానికంగా అందజేశారు. ఈ ఆయుర్వేద మూలిక వ్యవహారం ప్రభుత్వ అధికారుల వరకు వెళ్లింది.
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నాటు మందుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. మందు తయారీలో వాడుతున్న మూలికలు, ఇతర వివరాలను ఆనందయ్యను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అనుమతులు లేకపోవడంతో తయారీతోపాటు పంపిణీ ఆపేయాలని ఇటీవల ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చొరవ చూపడంతో తిరిగి ఇవాళ్టి నుంచి మందు పంపిణీ ప్రారంభమైంది. దీంతో మారుమూల గ్రామానికి జనం పొటెత్తుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.