అమరావతి : ప్రజలకిచ్చిన హామీలు, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన పనులు పూర్తి చేయలేని జగన్ వారసుడు ఎలా అవుతారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన కాంగ్రెస్ (Congress) సమావేశంలో ఆమె మాట్లాడారు. హంద్రీనీవా ప్రాజెక్టు (Handriniva project) ను వైఎస్ఆర్ 90 శాతం పూర్తి చేయగా మిగిలిన 10 శాతం పూర్తి చేయడానికి, గాలేరు-నగరి మిగిలిన 50 శాతం పనులు పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదని విమర్శించారు.
ప్రజలకిచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. వైఎస్సార్, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్న తేడా ఉందని ఆరోపించారు. ‘ వైసీపీ, జగనన్న కోసం ఎంతో కష్టపడ్డ. కనీసం కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. నా పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా. ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
టీడీపీ, జనసేన, వైసీపీలకు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా కాదు. సైన్యంలా మారి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఇచ్చిన హామీలు మరిచి కేడీగా మారారని దుయ్యబట్టారు. మోదీకి, బీజీపీకి మద్దతు ఇస్తున్న జగన్ కూడా కేడీనేనని షర్మిల విమర్శించారు.