నెల్లూరు: ఆంధ్రప్రదేశ్కు మిచాంగ్ తుఫాన్ (Cyclone Michaung) ముప్పు పొంచివున్నది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచాంగ్ తుఫాను గంటకు 13 కిలో మీటర్ల వేగంతో తుఫాన్ కదులుతున్నది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కిలోమీటర్లు, నెల్లూరుకు 250 కిలో మీటర్లు, బాపట్లకు 360 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 380కిలో మీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు- మచిలీపట్నం మధ్య తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో నెల్లూరు (Nellore) జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమయింది. మంగళవారం సాయంత్రం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలతోపాటు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ వెల్లడించారు.
Cyclone 1
దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తుఫాను ప్రభావం తగ్గేవరకు జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.