అమరావతి : ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకోక ముందే భారీ వర్షాలు పడుతుండడడంతో కడప, నెల్లూరు జిల్లా వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. పలు చోట్ల ఎడతెరపి లేకుండా, మరికొన్న చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, చెజర్ల, అనంతసాగరం, ఏయస్ పేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆత్మకూరులో అత్యధికంగా 10 సెం. మీ వర్షం నమోదు కాగా… సంగంలో 9 సెం.మీ గా నమోదైంది.
ఆత్మకూరులో ఎడతెరిపిలేని వర్షంతో పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనంతసాగరం ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు..డిమాండ్ చేశారు. కడపలో ఉదయం నుంచే వర్షం కురుస్తోంది. ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండు కుండలా మారాయి. వాగులు పొంగిపొర్లుతుండడంతో చిట్వేలి, రాపూర్ మధ్య రాకపోకలను నిలిపివేశారు. జమ్మల మడుగు, పుట్టపర్తిలో మోస్తరు వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారి పేట, అర్ధవీడు మండలంలో వర్షాలు పడుతున్నాయి.