విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసాయి. కాగా, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతున్నది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకూ విస్తరించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో గత 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద పప్పూరులో 15 సెంటీమీటర్లు, ధర్మవరంలో 12 సెంటీమీటర్ల వర్షం కురవగా.. చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఎల్లనూరు మండలంలో చిత్రవాతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. వరద ఉద్ధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న ఓ మహిళ.. రోడ్డు కుంగడంతో వరద నీటిలో పడిపోయింది. దాంతో అక్కడ ఉన్నవారు వెంటనే అప్రమత్తమై మహిళను కాపాడారు. కాగా, బుధవారానికి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నందున పలు ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ సూచించింది. అన్నమయ్య జిల్లాలో కురిసిన భారీ వర్షానికి సంపతికోట వాగు నీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. కారులోని కుటుంబసభ్యులను రక్షించిన ఓ యువతి.. ఊపిరాడక చనిపోవడం విషాదకరం.