Heavy Rains in AP | విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీలోని అన్ని జిల్లాలు జలమయమయ్యాయి. మధ్య భారతదేశంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జోరుగా వానలు పడుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఇన్ ఫ్లో పెరిగింది. మరోవైపు గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గేట్లను ఎత్తివేశారు. అటు తుంగభద్ర డ్యాంలోకి వరద నీటి ప్రవాహం పెరుగుతున్నది. అవసరం ఉంటేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని ప్రభుత్వం సూచిస్తున్నది.
ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున మత్స్యకారులు ఆదివారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకునేందుకు ఫోన్ నంబర్ 0863-2377118, హెల్ప్ లైన్ 18004250101తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియగా.. శనివారం జిల్లా వ్యాప్తంగా సగటున 309 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పోలవరం ముంపు మండలం దేవీపట్నం మండలంలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదని వారు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం ఈ సీజన్లో ఇదే తొలిసారి. ఇప్పటికే కాల్వల ద్వారా ఖరీఫ్ సాగుకు కృష్ణా తూర్పు, పడమరలకు నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజుల పాటు పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుంగభద్ర డ్యామ్కు పెరిగిన ఇన్ఫ్లో
మరోవైపు, కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్కు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. కర్ణాటకలోని శివమొగ్గ, అగుంబే, తేర్ధహల్లెతో సహా ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజుల క్రితం డ్యాంలోకి 34,075 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవగా.. శుక్రవారం రాత్రికి అది 75,562 క్యూసెక్కులకు చేరింది. డ్యాం పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సోమవారం నాటికి హై లెవల్ కెనాల్లోకి నీటిని విడుదల చేయాలని తుంగభద్ర డ్యాం అధికారులు భావిస్తున్నారు.