అమరావతి: జవాద్ తుఫాను (Jawad Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జవాద్ తుఫాను మరింత బలడి తీవ్ర తుఫానుగా మరనుందని, శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర దిశగా కదులుతూ రేపు మధ్యాహ్ననికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనావేసింది. తుఫాను తీరం దాటాకా బంగాళాఖాతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిప్రభావంతో ఉత్తరాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.
ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేసింది. ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్సింగ్పూర్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేసింది. తీరం వెంబడి గాలులు వేగం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తుఫాను కారణంగా 95కుపైగా రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దుచేసింది.
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గామారి ఉత్తరాంధ్ర నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించడంతో తెలంగాణకు ప్రమాదం తప్పిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులు రాష్ర్టంలో పొడివాతావరణం ఉంటుందని ప్రకటించింది.
కాగా, జవాద్ తుఫాన్ ప్రభావంతో రాష్ర్టంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు 15.7 నుంచి 19.9 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. పగటి ఉష్ణోగ్రతలు 31.2 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. మరో 3, 4 రోజులు ఇదేపరిస్థితి కొనసాగుతుందని వెల్లడించింది.