అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖపట్నంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తా ఆంధ్ర, రాజమండ్రి, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది.
కాగా, ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరు పాడు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు గత రెండు వారాలుగా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా కృష్ణా నది కింద ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తివేశారు.
భారీ వర్షాలతో కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్కు భారీ వరద కొనసాగుతున్నది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వానలతో ప్రకాశం బరాజ్ దగ్గర వరద పెరిగింది. వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశాలు ఉండటంతో వరద కొనసాగుతుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.