ఏలూరు జిల్లా: గత అర్ధరాత్రి నుంచి కుండపోతగా వాన కురుస్తున్నది. ఫలితంగా ఏలూరు నగరం జలదిగ్భందంలో చిక్కుకున్నది. రహదారులపై మూడు అడుగుల మేర వర్షపు నీరు నిలచింది. దాంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనదారులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ముఖ్యంగా ఆర్ఆర్ పేట, పవర్ పేట ప్రాంతాల్లో ఇంకా వాననీటిలోనే చిక్కుకుని ఉన్నాయి.
బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం కారణంగా ఏపీలో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. ఏలూరు జిల్లాలో గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఏలూరు నగరంలోని ఆర్ఆర్ పేట, పవర్ పేట ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయి ఉన్నాయి. రహదారిపై మూడు అడుగుల మేర వర్షం నీరు నిలువడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన పడిందంటే చాలు రోడ్లపై నీరు నిలవడం ఏలూరులో సర్వసాధారణంగా మారిందని, ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు చెప్పనలవికావని స్థానికులు చెప్తున్నారు.
ఏలూరు నగరానికి సమీపంలో తమ్మిలేరు ఉండటం వల్ల భారీ వర్షాలకు తమ్మిలేరు నుంచి వాన నీరు నగరంలోకి చేరుతున్నది. దాంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. చిన్నపాటి వాన కురిసినా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా జలమయం అవుతుండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ పేట రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన రోడ్డు జలమయంగా మారడంతో వెళ్లలేని దుస్థితి ఏర్పడింది.