అమరావతి : ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద పోటెత్తుతున్నది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నది నీటిమట్టం 11.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 9.75 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి పరవళ్లతో దేవీపట్నం మండలంలోని దాదాపు 36 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోనసీమలోని కాజ్వేలపైనుంచి వరద నీరు ప్రవహిస్తున్నది. యానాంలోని ఘాట్లు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.