Chegondi Suryaprakash | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు భారీ షాక్ తగిలింది. కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన ఆయన.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సూర్యప్రకాశ్.. పవన్ కళ్యాణ్ తీరును ఎండగట్టారు.
పవన్ కళ్యాణ్ను నమ్మి గతంలో జనసేనలో చేరానని సూర్యప్రకాశ్ తెలిపారు. బడుగు, బలహీనవర్గాలకు ఆయన దగ్గరగా ఉంటారని అనుకున్నా అని అన్నారు. ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పైకి కనిపించ పవన్ వేరు, తెర వెనుక పవన్ వేరు అని తెలిపారు. నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని నడపలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. తెలుగు దేశం పార్టీకి ఆయన కొమ్ముకాస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబునో.. లోకేశ్నో సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని.. అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం ఆయన పనిచేయలేదని ఆరోపించారు. పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ను నమ్మి మోసపోయారని అన్నారు. నాదేండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలను పవన్ వినరని అన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వద్దనే నాయకుడిని పవన్లోనే చూశానని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిదని హితవు పలికారు. ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.
అర్హత లేని వ్యక్తి కోసం ఇన్నాళ్లూ జనసేన పార్టీలో పనిచేశానని.. ఇక నుంచి జగన్ కోసం పనిచేస్తానని సూర్యప్రకాశ్ తెలిపారు. ఏపీ ఆశించకుండానే వైసీపీలో చేరానని.. క్రమశిక్షణ కలిగిన నేతగా పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీలు నడుపుతున్న వారిని ఈ రాష్ట్రం నుంచి తరమికొట్టాలని పిలుపునిచ్చారు.