తిరుపతి : తిరుమల(Tirumala)లో మే 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్(Hanmth) జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ(Ttd) ఈవో ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. ఉత్సవాలను నిర్వహించేందుకు ఎస్వీబీసీ , ఇంజినీరింగ్, శ్రీవారి ఆలయం, అన్నప్రసాదం, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో మంగళవారం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా(Review) సమావేశం నిర్వహించారు. ఆకాశ గంగ వద్ద ఐదు రోజుల పాటు శ్రీ హనుమంతుని జన్మ విశేషాలు, ఆధ్యాత్మిక పరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమల వేద విజ్ఞాన పీఠంలో అఖండ పారాయణం(akhanda parayanam)తో పాటు, యాగం నిర్వహించేందుకు పండితులను ఆహ్వానించాలని ఆదేశించారు.
ధర్మగిరితో పాటు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత వర్సిటీ, ఎస్వీ ఉన్నత వేద అధ్యయనాల్లోని వేదపండితులు పాల్గొనాలని కోరారు. మే 16న ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు నిరంతరాయంగా అఖండ పారాయణం కొనసాగుతుందన్నారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేద పండితుల సమూహంగా పటిస్తారని వెల్లడించారు.భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి ఆకాశ గంగ, నాద నీరాజనం వేదికలపై ప్రతిరోజూ అన్నమాచార్య, దాససాహిత్య, హెచ్డీపీపీ ప్రాజెక్టు కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.