తిరుమల: తిరుమలలో ఆంజనేయస్వామి జన్మస్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజున ఆకాశగంగ వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో అదనపు ఈవో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడు జన్మించిన స్థలంలో 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం శ్రీ అంజనాదేవికి, శ్రీ బాలాంజనేయస్వామివారికి అభిషేకం, అర్చన, ఇతర పూజలతోపాటు నివేదనలు సమర్పించామన్నారు.