అమరావతి: బాల్య వివాహాల నిర్మూలన కోసం ‘గర్ల్స్ అడ్వకేసీ అలయన్స్’ ప్రాజెక్ట్ పేరుతో హ్యూమన్ అండ్ నేచురల్ రిసోర్స్ డెవలప్మెంట్ సొసైటీ (హ్యాండ్స్) మహిళా, శిశు సంక్షేమ శాఖ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)తో కలిసి పనిచేస్తోంది. ఈసందర్భంగా హ్యాండ్స్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ కొండప్ప మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలోని గూటి, గుంతకల్, తాడిపత్రి తదితర మండలాలతోపాటు 10 మండలాల నుంచి బాల్య వివాహాలు చేయించేందుకు సిద్దమవుతున్నట్లు 136 ఫిర్యాదులు అందాయన్నారు. పదోతరగతి లోపు చదివేవాళ్లు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు.
వీరిలో 13-15 సంవత్సరాల మధ్య వయస్సు బాలికలున్నారని తెలిపారు. దాదాపు 42 ఫిర్యాదులు 13-15 ఏళ్లలోపు బాలికలకు సంబంధించినవి ఉన్నట్లు ఆయన చెప్పారు. గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్తో కలిసి హాండ్స్ సంస్థ పనిచేస్తోందని కొండప్ప తెలిపారు. అనంతపురం జిల్లాలో 4,741 మంది బాలికలు ఇప్పటికీ పాఠశాలలకు వెళ్లడం లేదు. బాల్య వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్ 1098కు తెలుపాలని కొండప్ప ప్రజలకు విజ్ఞప్తి చేశారు.