తూర్పు గోదావరి జిల్లా : రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులకు హామ్ రేడియోపై అకాడమీ ఆఫ్ హామ్ రేడియో అవగాహన కల్పించింది. చీఫ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏ రమేశ్ బాబు ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనివర్సిటీ సెమినార్ హాల్లో హామ్ రేడియో అవగాహన కార్యక్రమంలో రమేశ్ బాబు ప్రసంగించారు.
హోమ్ అమెచ్యూర్ మెకానిక్ రేడియో ఆవిర్భావం, దాని చారిత్రక నేపథ్యం గురించి రమేశ్ బాబు వెల్లడించారు. అత్యాధునిక టెక్నాలజీ, సెల్ ఫోన్ల ప్రపంచంలో హామ్ రేడియోకు ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సమాచారాన్ని చేరవేయడంలో హామ్ రేడియో సేవలు ఘననీయమైనవని కొనియాడారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం సమాచార వ్యవస్థను నిర్వహిస్తుందని చెప్పారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా తదితర సముద్ర తీర ప్రాంతాల్లో విపత్కర పరిస్థితుల్లో హామ్ రేడియో అందిస్తున్న సేవలను తన సొంత అనుభవాలతో కలిపి రమేశ్ బాబు వివరించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా హామ్ రేడియో సాంకేతికతను ఉపయోగించడంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం జగన్నాధరావు.. రమేశ్ బాబుకు జ్ఞాపికను అందజేసి అభినందించారు. క్యాంపస్లో హామ్ రేడియో ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని యూనివర్సిటీ అధికారులకు వీసీ సూచించారు. ఈ అవగాహనా కార్యక్రమంలో రిజిస్ట్రార్ టీ అశోక్, ప్రిన్సిపాల్ డాక్టర్ వీ పెర్సిస్, కన్వీనర్ జే హనుమంతు, కో-కన్వీనర్లు డాక్టర్ డీ శ్రీనివాసరావు, డాక్టర్ డీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.