అమరావతి : కనీస సౌకర్యాలకు నోచుకోలేపోతున్నామని ఆరోపిస్తూ అనకాపల్లి జిల్లాకు చెందిన ఆదివాసి గిరిజనులు ఐదు కిలోమీటర్లు అర్ధనగ్నంగా నడిచి నిరసన తెలిపారు. జిల్లాలోని రోడ్డుగుంట మండలం ఆర్ల పంచాయతీలోని పితురుగడ్డ, మూలపేట గ్రామానికి చెందిన గిరిజనులు తమకు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఈ నిరసన తెలిపారు. స్వాతంత్య్ర వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తమ తలరాతలు మారలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామాలకు రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నామని, రోగాల బారిన పడే గ్రామస్తులను డోలుకట్టి మోసుకొని దూరప్రాంతానికి వెళ్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఎవరూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.