Srisailam | శ్రీశైలం : కృష్ణాష్ణమి పర్వదినం సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలోని గోకులంలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతఃకాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహిస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నిత్యసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు. తొలుత ఆలయప్రాంగణంలోని గోకులంలో గోవులకు, గోవత్సాలకు (ఆవుదూడలకు) పూజలు చేశారు. ఈ విశేష కార్యక్రమంలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు. పూజాసంకల్పాన్ని పఠించారు. సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, అతివృష్టి, అనావృష్టి నివారించబడాలని, పాడిపంటలతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చేశారు. ఆ తర్వాత పూజలు నిర్విఘ్నంగా జరిగేందుకుకు మహాగణపతిపూజ జరిపించారు. శ్రీసూక్తంతోనూ, గో అష్టోత్తరమంత్రం, గోవులకు షోడశ పూజలు చేశారు. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.
EO Srinivasa Rao
ఆ దేవస్థాన గో సంరక్షణశాలలో కూడా శ్రీకృష్ణుని పూజ, గో పూజ నిర్వహించారు. వేదసంస్కృతిలో గోవుకు ఎంతో విశేషస్థానం ఉంది. మన వేదాలు ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలన్నీ గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి. గోవు సకల దేవతలకు ఆవాస స్థానమని.. గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మాత లలితాపరమేశ్వరి గోవురూపంలో భూమిపై సంచరిస్తుందని పండితులు పేర్కొన్నారు. తాను చేసిన ప్రతిపనిలోనూ వైశిష్ట్యాన్ని బోధించిన శ్రీ కృష్ణపరమాత్మ ఆవుల మంద అధికంగా ఉన్న కారణంగా గోకులంగా పేరొందిన రేపల్లెలో పెరిగి గోవులను కాసి, గోపాలునిగా పేరుగాంచడని.. గోవు మహిమను లోకానికి తెలియజెప్పాడన్నారు. ఈ కారణంగానే గోకులాష్టమి రోజున గోవును పూజించడం సంప్రదాయంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు, అర్చక స్వాములు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.