అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం పట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని గవర్నర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గుండెపోటుతో మృతి చెందిన సన్నిహితుడి మరణం తీవ్రంగా కలిచి వేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ లాయర్ గా జీవితాన్ని ప్రారంభించి, ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి శ్రీకాళహస్తి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసా’ డని తెలిపారు. అణునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై తక్షణం స్పందించేవారని కొనియాడారు. బొజ్జల మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు బాబు తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.