అమరావతి : చలో విజయవాడకు తరలివచ్చిన లక్షలాది ఉద్యోగులను చూసైనా ఏపీ ప్రభుత్వం తమ మొండివైఖరిని వీడి ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని పీఆర్సీ సాధన సమితి నాయకుడు వెంకట్రామిరెడ్డి కోరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ కోసం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉద్యమం విజయవాడ చరిత్రలో చూడలేదని అన్నారు.
ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించిన లక్షలాదిగా విజయవాడకు వచ్చిన ఉద్యోగులందరికీ సాధన సమితి తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ప్రజల్లో వ్యతిరేక భావన కలిగేలా ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఉద్యమానికి పోలీసులు సహకరించారని చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఘర్షణ వాతావరణం రాకుండా పోలీసులు వ్యవహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగుల మేలు కోసం పవన్ సహా ఎవరూ మద్దతిచ్చినా మంచిదేనని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.