AP News | టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ సీటును జనసేన కావాలని అడుగుతున్నది.. కానీ ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తానే పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి మొదట్నుంచి పట్టుబడుతున్నాడు. దీంతో ఆ సీటు ఎవరికి కేటాయిస్తారనేది కొద్దిరోజులుగా ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబితాలో రాజమండ్రి రూరల్ లేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఈ క్రమంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి రూరల్ సీటు తనదే.. గెలుపు తనదే అని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. జాబితాలో తన పేరు ఉందని.. అయితే జనసేన నేతలను ఒప్పించాలనే ఉద్దేశంతో చివరి నిమిషంలో ఆపేశారని చెప్పి షాకిచ్చారు. ఈ క్రమంలోనే టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పుకొచ్చారు. కాగా, టీడీపీలో సీనియర్ నాయకులు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో బుచ్చయ్య చౌదరికే టికెట్ కేటాయించాలని చంద్రబాబు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం లేపేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన 24 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడంపై జనసేన నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి సమయంలో ముందు నుంచి అడుగుతున్న రాజమండ్రి రూరల్ సీటు కూడా టీడీపీనే తీసుకుంటుందని తెలియడంతో జనసేన సైనికులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.