TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన టికెట్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆయా సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 21న ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని చెప్పింది. లాటరీలో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12గంటల్లోగా డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది.
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అలాగే, అదే రోజున వర్చువల్ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు చెప్పింది. శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల పేర్కొంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల 23న మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు దేవస్థానం పేర్కొంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని చెప్పింది. ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లోనే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం కోరింది.