తిరుమల : శ్రీవారి భక్తులకు తిరుమల, తిరుపతి దేవస్థానం గుడ్న్యూస్ తెలిపింది. భక్తులు సులభతరంగా శ్రీవాణి దర్శన ( Srivani Tickets ) టికెట్లు పొందడానికి టీటీడీ (TTD) అధికారులు మరో నూతన కౌంటర్(New Counter) ను ప్రారంభించారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు నూతన కౌంటర్ వద్ద అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ ను కేటాయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు వెల్లడించారు. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.
రోజుకు 900 టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు వివరించారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పట్టేదనీ, ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్ లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు.