తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో (Tirumala) శుక్రవారం స్వర్ణ రథం (Golden Chariot) ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువై తీరి మాడ వీధుల్లో విహరించారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు, భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంతో గోవిందా..గోవిందా అంటూ స్వర్ణ రథాన్ని లాగారు. పాలకమండలి సభ్యురాలు సుచిత్రా ఎల్లా, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఉత్తర ద్వార దర్శనం కోసం రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో శుక్రవారం తెల్లవారుజాము నుంచే శ్రీ వేంకటేశ్వరస్వామిని (Lord Venkateswar )ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Dattatreya), కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కుటుంబ సభ్యులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad), డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుందర, బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ (Gopichand), ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు.