అమరావతి: అమరావతి రైతులను అన్ని విధాలుగా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని దేవుడు కూడా క్షమించడని టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం వేలాది ఎకరాల భూములిచ్చిన రైతాంగాన్ని అడుగడుగునా పీడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్తగా అమరావతి కార్పొరేషన్ పేరిట కొత్త డ్రామాకు వైసీపీ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. అమరావతి కార్పొరేషన్లో 29 గ్రామాల బదులు 19 గ్రామాలను మాత్రమే విలీనానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ చర్యలను గ్రామ సభల్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేషన్ పేరిట అమరావతి భూములను విక్రయించడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన ఆరోపించారు.