తిరుపతి : శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఇవాళ తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్. ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు.
పూర్వం పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవ రాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామి వారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య లో వచ్చిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరుల ను అధిరోహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మూడు వేల మందికిపైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు.