విజయవాడ రైల్వే స్టేషన్లో మూడేళ్ల బాలిక కిడ్నాప్నకు గురైంది. పాప కనిపించకుండాపోయిన విషయాన్ని గుర్తించిన తల్లి అంతలోనే తేరుకుని రైల్వే స్టేషన్లో వెదికినా ఫలితం లేకపోయింది. దాంతో తన చిన్నారిని ఎవరో ఎత్తుకెళ్లారంటూ తల్లి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్నకు గురైన బాలికను షేక్ షఫీదాగా, తల్లిదండ్రులు రైల్వే స్టేషన్లో చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుని జీవనం సాగిస్తుంటారని విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసు అధికారులు కేసు నమోదు చేసి చిన్నారి ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
చిన్నారి షేక్ షఫీదాను తీసుకెళ్తున్న దృశ్యాలు రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్లారనేది తెలుసుకునేందుకు విజయవాడ పోలీసులు నగరంలోని సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. షఫీదాను రైల్వేస్టేషన్ బయటకు తీసుకువచ్చి ఆటోలో తీసుకెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్లో నమోదైంది. నెహ్రూ బొమ్మ సెంటర్ ఏరియాలో కొండపైకి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. చిట్టినగర్, పంజాసెంటర్, వాగు సెంటర్, డెయిరీ ఫ్యాక్టరీ సితార సెంటర్ తదితర ప్రాంతాల్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. సీసీటీవీ ఫుటేజీని నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు పంపించారు. షఫీదా ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ రైల్వే స్టేషన్లోని 10వ నంబర్ ప్లాట్ఫాంపై ఆడుకుంటున్న చిన్నారి వద్దకు గుర్తుతెలియని మహిళ వచ్చింది. చిన్నారికి చాక్లెట్లు ఇప్పించి ఆ బాలికను అపహరించుకుపోయింది. ఆ సమయంలో చిన్నారి తల్లి నిద్రిపోతుండగా.. తండ్రి బయటకు వెళ్లాడు. పాప కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన తల్లి వెంటనే రైల్వే స్టేషన్లో వెదికింది. రైల్వే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. పాపను ఎత్తుకెళ్లిన మహిళను గుర్తించేందుకు పోలీసులు రైల్వే స్టేషన్ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్కు కిలోమీటరు దూరంలో ఉన్న నెహ్రూ నగర్ వైపు వెళ్లడం కనిపించిందని పోలీసులు తెలిపారు.