అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటనలో వంద మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ ఎస్ఈజడ్లోని సీడ్స్ యూనిట్లో గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో వాంతులు, తల తిరగడం, కళ్ల మంటల భయంతో సీడ్ కంపెనీ ఉద్యోగులు పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన నలుగురు మహిళలకు బ్రాండిక్స్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
సెజ్ పరిధిలోని పోరస్ కంపెనీ నుంచి అమ్మోనియా వాయువు లీకేజీ అయినట్లు అధికారులు గుర్తించారు. లీకేజీకి గల కారణాలను కాలుష్య నియంత్రణ అధికారులు తెలుసుకుంటున్నారు. గ్యాస్ లీకేజీ ఘటన తరువాత బ్రాండిక్స్ యాజమాన్యం రెండో షిఫ్ట్ రద్దుచేసి ఉద్యోగులను ఇళ్లకు పంపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఘటనాస్థలికి వెళ్లాలని వైద్యారోగ్య శాఖ అధికారి హేమంత్కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.