తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన గరుడసేవ అక్టోబర్ 1న జరగనున్న నేపథ్యంలో భక్తులందరికి వాహన దర్శనం కల్పించేందుకు విస్తృత ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. ఇవాళ శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో హారతి పాయింట్లు, గ్యాలరీలను ఈవో, డీఐజీ రవి ప్రకాష్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈవో మాట్లాడుతూ దాదాపు మూడు లక్షల మంది భక్తులకు శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది సౌత్ వెస్ట్ గేటు, నార్త్ వెస్ట్ గేటు, నార్త్ ఈస్ట్ గెట్ల వద్ద ఉన్న హారతి పాయింట్లలో హారతులకు బదులు భక్తులను స్వామి వారి వాహన సేవకు అనుమతిస్తామన్నారు. ప్రతి హారతి పాయింట్లో 10 వేల మందికి గరుడసేవ దర్శనం కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు.
టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వివిధ రకాల ప్రివలైజ్ దర్శనాలు రద్దుచేసి, సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్లు తెలిపారు.