తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం ( గుండె చికిత్సల ఆసుపత్రి) లో మరో ఏడు ఓపెన్ హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు.వీరిలో నలుగురిని బుధవారం డిశ్చార్జ్ చేస్తున్న సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఐసీయూ, జనరల్ వార్డులో చికిత్స పొందుతున్న పిల్లలు, వారి తల్లిదండ్రులు, డాక్టర్ల బృందంతో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాది అక్టోబరు 11వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి ప్రారంభించగా, వెంటనే ఓపి సేవలు ప్రారంభించామన్నారు. నెలరోజుల్లోనే నవంబరు 11వ తేదీన తొలి ఓపెన్ హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్లు చేయించే స్థోమత లేని పేద తల్లిదండ్రులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయడం సంతోషకరమన్నారు.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపతో పేదలకు మరింతగా వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వివరించారు. ఆసుపత్రి ప్రారంభమయ్యాక మొదట ఒక బాలికకు, తరువాత ఇద్దరు చిన్నారులకు వైద్యులు విజయవంతంగా గుండె ఆపరేషన్లు చేశారని ఈవో చెప్పారు. ఇప్పుడు ఒకే విడతలో రెండునెలల నుంచి ఆరేళ్ళ వయసు కలిగిన ఏడుగురు చిన్నారులకు విజయవంతంగా సర్జరీలు చేశారని డాక్టర్ల బృందాన్ని ఈవో అభినందించారు.