హైదరాబాద్: తిరుపతిలో వరుస మిస్సింగ్లు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురికిపైగా కనిపించకుండాపోయారు. సత్యనారాయణపురానికి చెందిన బాలిక మోనిషా అదృశ్యమైంది. గుడికి వెళ్లిన ఈ బాలిక తర్వాత ఇంటికి రాలేదు. ఆ తర్వాత చెన్నారెడ్డి కాలనీలో ఎనిమిదో తరగతి చదువుతున్న వంశీకృష్ణ ఐస్క్రీం కోసం వెళ్లి కనిపించలేదు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఓ వివాహిత, తర్వాత మరో యువకుడు కనిపించకుండాపోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.
మే 22న సాయి అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల కోసం నగరి పోస్ట్ ఆఫీస్ వీధికి చెందిన వివేక్.. తిరుపతిలోని లక్ష్మీపురం వచ్చారు. వివేక్ కనపడడం లేదని అతడి తల్లి ఆర్.విజయలక్ష్మి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పది రోజుల నుంచి వివేక్ ఫోన్ స్విచాఫ్ రావడంతో స్నేహితులపై అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులను ఆశ్రయించారు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
వంశీ అనే బాలుడు కనిపించడం లేదని తండ్రి సురేశ్.. అలిపిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డి కాలనీలో వంశీ కుటుంబం నివాసముంటోంది. బాలుడి తండ్రి సురేశ్ తిరుమలలో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి వెళ్లిన వంశీకృష్ణ కనిపించకుండా పోయాడు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆ తర్వాత తిరుపతిలో మరో మహిళ మిస్ అయ్యారు. తన కూతురు రేణుక కనపడలేదని అలిపిరి పోలీస్ స్టేషన్లో తండ్రి ప్రసాద్ ఫిర్యాదు చేశాడు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళం సమీపంలో మహిళ కుటుంబం నివాసముంటోంది. ఆమెకు నంద్యాలకు చెందిన మహేశ్కుమార్తో వివాహమైంది. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరుసగా మిస్సింగ్ కేసులు నమోదు కావడంపై ఆందోళనతోపాటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.