అనకాపల్లి జిల్లా : ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బాణసంచా అక్రమ తయారీ గుట్టు రట్టయింది. ఈ పేలుడులో నలుగురు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తున్నది. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. యాతపాలెం సమీపంలోని అక్రమ బాణసంచా గోదాములో ఈ పేలుడు సంభవించింది.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పరిధిలో బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు సంభవించింది. ఉదయం వంట చేస్తుండగా టపాసుల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగాయని స్థానికులు చెప్తున్నారు. ఈ పేలుడు ధాటికి నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు అనకాపల్లి దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిని నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు దవాఖాన వర్గాల ద్వారా తెలుస్తున్నది. గాయపడిన వారిని శంకర్రావు, కమలమ్మ, ప్రసాద్, మహేశ్గా గుర్తించారు. సమాచారం అందగానే సబ్బవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేపట్టారు.
యాతపాలెం సమీపంలోని పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా టపాసులు తయారుచేస్తున్నట్లుగా తెలుస్తున్నది. కంచరపాలెంకు చెందిన ఇద్దరు ఈ బాణసంచా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రహస్యంగా టపాసులు తయారుచేస్తూ చాలా ప్రాంతాల్లో ఇలాగే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఇలాంటి వాటిని గుర్తించి నిలువరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనకాపల్లిలోని పలు గ్రామాల్లో అక్రమంగా బాణసంచా తయారీ చేస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు.