విజయవాడ: రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నెల రోజుల్లోగా అభ్యంతరాలను అందించాలని నోటిఫికేషన్లో సూచించింది. కాగా, కొత్త జిల్లాల ఏర్పాటును ఏపీ బీజేపీ స్వాగతించింది. కొత్త జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందని చెప్పిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ఇదే సమయంలో మా ప్లాన్ను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నదని బాంబు పేల్చారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని చెప్పిన సోము వీర్రాజు.. ఆనాటి బీజేపీ ప్రణాళికను నేటి జగన్ ప్రభుత్వం అమలుపరుస్తున్నదన్నారు. దీనిని బట్టి పరిపాలన పట్ల బీజేపీకి ఉన్న దూరదృష్టిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.రెండేండ్ల క్రితమే 26 మంది జిల్లా అధ్యక్షులను నియమించి, జిల్లా కమిటీలను కూడా వేశామన్నారు. కొత్త జిల్లాలకు స్థానిక ప్రజల అభిప్రాయాల మేరకు పేర్లు పెట్టాలని సోము వీర్రాజు ప్రభుత్వానికి సూచించారు.