వనపర్తి : దేశంలో రైతుల ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను ఏర్పాటు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి బాధ్యతలు స్వీకరణకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతును రాజుగా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని అన్నారు. తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాలను దేశంలోని ప్రతి రైతు దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగడతామని పేర్కొన్నారు.
ఏరాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ వ్యవసాయ అనుకూల పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు.ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత కల్పించడంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని వెల్లడించారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో అదనంగా కోటి ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు, సాగునీటి కల్పనతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు.
వ్యవసాయం దండుగ కాదు. పండుగ అని కేసీఆర్ నిరూపించారని అన్నారు. వ్యవసాయ రంగం బలోపేతం అయితే అత్యధిక శాతం మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నది కేసీఆర్ ఆలోచనని పేర్కొన్నారు. కేంద్రంలోని ప్రభుత్వానికి వ్యవసాయరంగా పట్ల నిర్దిష్టమయిన విధానం లేదని దుయ్యబట్టారు.ఎరువుల సబ్సిడీలో కోత, పంటల కొనుగోలులో నిర్లక్ష్యం, డీజిల్ , పెట్రోల్ ధరల పెంపుతో వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు అనూహ్యంగా పెరిగిపోయాయని ఆరోపించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ బాలీశ్వర్ రెడ్డి, డైరెక్టర్ లను మంత్రి అభినందించారు.